
* పాక్ ఉగ్రవాదంపై గట్టి చర్యలకు ఛాన్స్
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: త్వరలో అమెరికాలో ఏర్పాటు కాబోయే ట్రంప్ ప్రభుత్వంలో ఓ మహిళ నియామకం పాకిస్థాన్ను భయపెడుతుంటే.. భారత్ను సంతోషపెడుతోంది. ఆమే తులసీ గబ్బార్డ్. నూతన కార్యవర్గంలో అగ్రరాజ్య నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతి. ఆమె ఉగ్రవాద చర్యలకు పూర్తిగా వ్యతిరేకం. పాక్ అనుసరిస్తున్న ఉగ్రవాద చర్యలను ఎప్పుడూ ఖండిస్తూ వచ్చారు. ఒక హిందువు ఈ పదవిని అధిష్ఠించడం ఇదే తొలిసారి. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరని ఆమె గత ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తులసి భారత మూలాలున్న మహిళనాకాదు..! పూర్తిగా అమెరికా జాతీయురాలు..! అమెరికాలోని మొత్తం 18 నిఘా సంస్థలు డీఎన్ఐ హోదాలో తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా.. ఇవి సమాచారాన్ని క్షణంలో సేకరిస్తాయి. చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు.
నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది. అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండటంతో తులసి నియామకానికి తేలిగ్గా ఆమోదముద్ర పడుతుంది. తులసి భారత్ను అమితంగా ఇష్టపడతారు. ఆమె మూలాలు ఇక్కడ ఉన్నాయని చాలా మంది భావించేంతగా అభిమానిస్తారు. అయితే.. 2012లో తాను భారతీయురాలిని కాదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని తులసి పలు సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు. పుల్వామా దాడి వేళ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం పాక్ మానుకోవాలని హెచ్చరించారు.
…………………………………..