
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలతో కూడిన 2 షూరిటీలూ సమర్పించాలని న్యాయస్థానం షరతు విధించింది. అలాగే వ్యక్తిగతమైన పాస్ పోర్టులు సమర్పించాలని ఇద్దరికీ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దని భుజంగరావు, రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని చాలా కీలకమైన అంశాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర ఉందని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. నాంపల్లి కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను రెండు సార్లు తిరస్కరించింది.
దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఇద్దరు. ఈ కేసులో పదినెలలకు పైగా జైలులో ఉన్నామని, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఇరువురు హైకోర్టును కోరారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈకేసులో ఇంకా విచారణ సాగుతోందని, ఎక్కడా కూడా సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యాప్తు అధికారులను కూడా ప్రభావితం చేసేలా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించడంతో వారి వ్యక్తిగతమైన పాస్ట్పోర్టులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని భుజంగరావు, రాధాకిషన్రావుకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో రాధాకిషన్రావు ముందస్తు బెయిల్పై ఉన్నారు. ప్రస్తుతం హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో భుజంగరావు శనివారం ఉదయం బెయిల్పై విడుదల అవుతారని సమాచారం.
………………………………