
* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆకేరు న్యూస్, మాదాపూర్: కొత్తగా నియామకమైన ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని తమ కెరీర్లను నిర్మించుకోవాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గురువారం హైటెక్స్ ప్రాంగణంలోని న్యాక్ (నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్)లో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 156 మంది ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీర్లకు శాఖపరమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న 5 రోజుల ఒరియెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన మంత్రి నూతన ఇంజనీర్లకు మార్గనిర్ధేశనం చేశారు. గత పదేండ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డట్టే.. ఆర్ అండ్ బీ శాఖ సైతం నియామకాలు జరగక, ఇంజనీర్లు లేక పనులను పర్యవేక్షించే పరిస్థితిలేక ధైన్యంగా కాలం వెల్లదీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పది మండలాలకు ఒక్క ఇంజనీర్ అందుబాటులోలేని దుర్భర పరిస్థితులను ఆర్ అండ్ బీ శాఖ చూసిందని ఆయన అన్నారు. అందుకే టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లలో ఆర్ అండ్ బీ శాఖకు కేటాయించబడిన 156 మంది ఏఈఈలను ఫీల్డ్ లోకి పంపించేందుకే ఒరియెంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. పదేండ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో..ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. కొందరు పాలకులు, అతికొద్దిమంది ఇంజనీర్ల స్వార్ధం యావత్ ఇంజనీర్లందరికి మాయని మచ్చగా మారింది. మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యనో, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ వంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలి కానీ కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మీ అందరిని కోరుకుంటున్నా. రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన సంఘటనలను మనం చూసాం.. దయచేసి అలాంటి ఇంజనీర్లను కనీసం కలలోకి కూడా రానివ్వకండని నేను సలహా ఇస్తున్నా. విశ్వేశ్వరయ్య వంటి ఇంజనీర్లు రూపొందించిన ప్రణాళికలు ఇవ్వాల్టీకి కూడా మనల్ని రక్షిస్తున్నాయి.
ఒకరోజు విశ్వేశ్వరయ్య పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రైయిన్ లో వెళ్తుంటారు.. ట్రైయిన్ కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత విశ్వేశ్వరయ్య గారు చైన్ లాగి ట్రైయిన్ ను ఆపేస్తాడు.. ట్రైయిన్ లో ఉన్న బ్రిటీషర్లంతా విశ్వేశ్వరయ్య ఎందుకు ట్రైయిన్ ఆపారో అర్ధంకాక చూస్తుంటారు.. ఇంతలో ట్రైయిన్ సిబ్బంది వచ్చి.. విశ్వేశ్వరయ్యను పట్టుకొని చైన్ ఎందుకు లాగారని ప్రశ్నిస్తారు.. అందుకు విశ్వేశ్వరయ్య కొద్ది దూరంలో నాకు రైలు పట్టాలు విరిగినట్లు అనుమానంగా ఉంది. ట్రైయిన్ నడుస్తున్నప్పుడు శబ్ధం మారిందని వివరిస్తారు. ట్రైయిన్ సిబ్బంది కొంత దూరం పట్టాలను పరిశీలించి నిజంగానే పట్టాలు విరిగినట్టు గుర్తిస్తారు.. విశ్వేశ్వరయ్యను అభినందిస్తారు. మీరంతా విశ్వేశ్వరయ్యలా అత్యంత శ్రద్ధతో భక్తితో విధులు నిర్వహించాలని నా సూచన. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీ కొత్త ఇంజనీర్ల పట్ల అత్యంత ఆశాభావంతో ఉంది. మీరంతా మీకు అప్పగించిన పనిని నిబద్ధతతో చేస్తే మన రాష్ట్రం ప్రగతిబాటన సాగుతుంది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రాష్ట్ర ప్రగతిలో కీలకమైన సూపర్ గేమ్ ఛేంజర్ లాంటి %RRR% తో పాటు, టిమ్స్ హాస్పిటల్ భవనాలు, జిల్లాల్లో పరిపాలనపరమైన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరంతా కొత్తగా ఎంపికై ఉద్యోగాల్లోకి చేరుకుంటున్న ఈ సమయంలో ఒక ఇంజనీర్ గా నా సలహా ఎంటంటే… మీరు నిర్మించేంది కేవలం రోడ్డో, బ్రిడ్జినో, భవనమో కాదు.. అది లక్షల మంది అవసరాలు తీర్చే ఒక కట్టడం అన్న సంగతిని గుర్తెరగాలని కోరుకుంటున్న. అప్పుడు మాత్రమే మీరు నాణ్యమైన నిర్మాణాలను చేపడతారని నేను విశ్వసిస్తున్నాను. మీరు చేయిస్తున్న ప్రతీ పని మాదో, మీదో కాదు.. రాష్ట్ర ప్రజల సంపదను బాధ్యతగా వారి కోసం వినియోగించే ఒక యగ్ఞంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. రిక్రూట్మెంట్లను వేగవంతం చేసి పోస్టింగులు ఇచ్చాము. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది. గత ప్రభుత్వం 10 మండలానికో ఇంజనీర్ కూడా లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొస్తే… మేం రిక్రూట్మెంట్లు పూర్తి చేసి ఆర్ అండ్ బీ ని పటిష్టం చేస్తున్నాం. నేను 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటా. మీకు కూడా ఏదైన సమస్య ఉంటే నాకు చెప్పండి వెంటనే పరిష్కరిస్తా. మీరు, మేం అంతా ఒక కుటుంబంలా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిద్దాం. ?రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం.. పదేండ్లు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తాం.
………………………………………