
* అందరం కలిసి ముందుకు తీసుకెళదాం
* విశాఖ రైల్వేజోన్ను కూడా పట్టాలెక్కించాం
* ఆర్నెళ్లలో ఏపీకి 3 లక్షల కోట్ల సహకారం
* కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ పర్యటనకు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (CENTRAL HOME MINISTER AMITHSHAH) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ముందుకు తీసుకెళతామని, అందుకే విశాఖ ఉక్కుకు రూ. 11,440 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఏపీలో కూటమికి అనూహ్య విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ (VIJAYAWADA)కొండపావులూరులో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF) రైజింగ్ డే వేడుకల్లో ఎన్డీఆర్ ఎఫ్ 10వ బెటాలియన్ను మిత్షా హాజరై ప్రారంభించారు. NDRF పరికరాల గ్యాలరీని అమిత్షా సందర్శించారు. తిరుపతి(TIRUPATHI) రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను.. వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, బండి సంజయ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎంతలా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. గత ప్రభుత్వం చేసిన ధ్వంసం మానవ విపత్తుకు సంబంధించినదని వివరించారు. ఆ విపత్తు నుంచి రక్షించేందుకు ఎన్డీఏ వచ్చిందన్నారు. గతంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని, మోదీ(MODI), చంద్రబాబు(CHANDRABABU) నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతలు ప్రగతి సాధిస్తామని తెలిపారు. ఆరు నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్టదాఖలు చేసిందన్నారు. హడ్కో ద్వారా అమరావతికి 27 వేల కోట్ల సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు(POLAVARAM PROJECT)పై చంద్రబాబుతో చర్చించానని, 2028 లోపు ఏపీ మొత్తం పోలవరంతో నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుకు మోదీ అండదండలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. విశాఖలో రూ. 2 లక్షల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు తెస్తున్నట్లు వివరించారు. విశాఖ రైల్వేజోన్ను కూడా పట్టాలెక్కించామన్నారు.
…………………………………………………..