
* కూర్మన్నపాలెం జంక్షన్ లో మూడేళ్లుగా కొనసాగుతున్న దీక్షలు
* ఈ రోజు భారీ సంఖ్యలో చేరుకున్న కార్మికులు
* నేషనల్ హైవే దిగ్బంధం
* స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్
* ఢిల్లీ స్థాయిలో స్పష్టమైన ప్రకటన రావాలని చేస్తున్న నిరసనలు ఉధృతం
* రంగంలోకి పోలీసులు.. అదుపులో కార్మికులు
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్(Visakapatnam Steel Plant) కార్మికులు పిడికిలి బిగించారు. ప్రైవేటుపరం చేస్తే సహించేదిలేదని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ మరోసారి ఉద్యమం(Agitation) తీవ్రతరం చేశారు. కూర్మన్నపాలెం జంక్షన్(kurmanna palem junction) లోని దీక్షా శిబిరం వద్దకు ఈ రోజు భారీ స్థాయిలో ఉద్యోగులు, కార్మికులు తరలివచ్చారు. నేషనల్ హైవేను దిగ్బందించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ఢిల్లీ(Delhi) స్థాయిలో ఓ స్పష్టమైన ప్రకటన రావాలని డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో ట్రాఫిక్ జాం(Traffic Jam) అవుతుండడంతో పోలీసులు రంగంలోకి దిగి కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం వివక్ష రూపుతోందని విమర్శించారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎందుకు ఒత్తడి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలలైందని హామీ ఇచ్చి, ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదన్నారు. ఓవైపు మద్దతు ఇస్తామన్న చంద్రబాబు(Chandrababu).. మరోవైపు పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కడుపుమండి రోడ్డుపై ఆర్తనాదాలు చేస్తుంటే, బలవంతంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు(Visakha Ukku-Andhura Hakku) అని నినాదాలు హోరెత్తిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తెలిపారు. బతుకు భారం – నా ఊపిరి విశాఖ ఉక్కు పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఇబ్బంది లేదని, నేషనల్ హైవేను దిగ్బందించడంతో కార్మికులను అరెస్టు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ప్రజా రవాణాకు భంగం కలిగిన నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుంటున్నామని వివరించారు.
—————————–