*వరంగల్ ఖ్యాతిని చాటిన ఏసీపీలు…
*బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ కైవసం.
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో వరంగల్ పోలీస్ అధికారులు సత్తా చాటారు. సైబరాబాద్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ – 2026లో వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీల జోడీ బ్యాడ్మింటన్ విభాగంలో అద్భుత విజయాన్ని నమోదు చేసి, బంగారు పతకాన్ని సాధించింది. 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ నుంచి ఏసీపీ జితేందర్ రెడ్డి, ఏసీపీ మధుసూదన్ జోడీగా బరిలోకి దిగారు. టోర్నీ ఆరంభం నుంచే తమదైన శైలిలో రాణించిన ఈ ద్వయం, ఫైనల్ పోరులో ప్రత్యర్థులపై పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. తమ పదునైన ఆటతీరుతో ప్రత్యర్థులను కట్టడి చేస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పుడూ బిజీగా ఉండే అధికారులు, క్రీడల పట్ల చూపుతున్న మక్కువ అందరినీ ఆకట్టుకుంటోంది. వరంగల్ కమిషనరేట్ నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను ఉన్నతాధికారులు, తోటి సహచర సిబ్బంది వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విజయం యువ పోలీస్ అధికారులకు స్ఫూర్తినిస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
—————————-
