
* నాలుగున్నర గంటలు.. అందాల మిరుమిట్లు
* విశ్వవ్యాప్తం కానున్న జిల్లా ఖ్యాతి
* బృందాల వారీగా నేడు ప్రపంచ సుందరీమణుల రాక
* సాయంత్రం నుంచీ సందడే సందడి
* చారిత్రక ప్రదేశాల సందర్శన..
* అందగత్తెల కోసం అందమైన బహుమతులు సిద్ధం
ఆకేరు న్యూస్, వరంగల్ :
ఓరుగల్లు ఖ్యాతిని గర్వంగా చాటే పురాతన కోట..
మనసు దోచే కాకతీయ శిల్పకళా వైభవం..
కళ్లను కట్టిపడేసే చారిత్రక కట్టడాల నిర్మాణ శైలి..
వరంగల్ విశిష్ఠతకు కొన్ని నిదర్శనాలు. అంతటి విశిష్ఠ జిల్లా నేడు అందమైన భామల రాకతో మరింత వెలుగొందనుంది. ఓరుగల్లులోని కాకతీయ కళలకు నేడు.. ఆ భామల వయ్యారాలు తోడు కానున్నాయి. మనసు దోచే శిల్ప కళావైభవానికి నెలవైన ఓరుగల్లు.. సుందరీమణుల మిరుమిట్లుకు వేదిక కానుంది. మిస్ వరల్డ్ -2025 పోటీల నేపథ్యంలో కళలు, చారిత్రక కట్టడాల కేంద్రమైన వరంగల్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా తెలంగాణ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ జరూర్ ఆనా..
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణుల పర్యటనకు ఓరుగల్లులో అధికార యంత్రంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రముఖ ప్రాంతాలను వారు సందర్శించనున్నారు. వారికి ఎక్కడా ఓలాంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం వీరి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా చర్యలు చేపడుతోంది. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు.. పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించింది. ఈ పర్యనటలో వరంగల్ ను కూడా భాగస్వామ్యం చేసింది. దీని ద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనుంది.
వేర్వేరుగా బృందాలుగా..
వేర్వేరు బృందాలుగా ప్రపంచ సుందరీమణులు వరంగల్ కు చేరుకోనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 35 మంది అందాల భామలు ప్రత్యేక బస్సులో రామప్ప సరస్సు కట్టపై ఉన్న వరంగల్ కు చేరుకుంటారు. హోటల్ హరితలో రిలాక్స్ అయిన అనంతరం.. సంప్రదాయ దుస్తుల్లో రామప్ప ఆలయానికి బయలుదేరనున్నారు. 22 మందితో కూడిన ఓ బృందం హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి 5.25కు రామప్ప ఆలయాన్ని సందర్శిస్తుంది. అక్కడ వారికి కొయ్య, గిరిజన నృత్యాలతో స్వాగతం పలకనున్నారు. 5.35కు రెండు బృందాలుగా రామలిగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఆలయ శిల్ప కళాను వీక్షిస్తారు. 5.45కు వేయి స్తంభాల గుడికి చేరుకుంటారు. అనంతరం ఖిలా వరంగల్ కు చేరుకుంటారు. 7.20 వరకు పేరిణి శివతాండవం, ఇతర నృత్య ప్రదర్శనలను వీక్షించి హోటల్ హరితకు చేరుకుంటారు. అదే సమయంలో మరో బృందం రామప్ప ఆలయంలోని ప్రదర్శనలను వీక్షిస్తుంది. ప్రముఖుల చేత సత్కారాలను అందుకుంటుంది. రాత్రి 8 గంటల నుంచి 8.30 గంటల వరకు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన విందును ఆరగించనున్నారు. అనంతరం 9.15 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.
అతిథులకు అందమైన బహుమతులు
వరంగల్ కు విచ్చేసే సుందరీమణులకు అందించేందుకు అధికారులు వినూత్న బహుమతులను సిద్ధం చేశారు. అతిథులకు గుర్తుండిపోయేలా వాటిని రూపొందించారు. వరంగల్ కే ప్రత్యేకంగా నిలుస్తున్న చేనేత కళంకారీ దరీస్, రంగశాయి పేటకు చెందిన కళాకారులు ఆరు నెలల పాటు శ్రమించి రూపొందించిన ప్రత్యేక షీల్డ్ లను అందజేయనున్నారు. అలాగే జిల్లా అటవీ శాఖ అధికారులు వెదురు కర్రతో బొమ్మలను తయారు చేయించారు. ఎద్దుల బండిలో దంపతులు ప్రయాణిస్తున్నట్లుగా, పురివిప్పిన నెమలి తదితర బొమ్మలను కళాకారులు తీర్చిదిద్దారు.
……………………………………………….