
* అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా మాల నేతల చర్యలు
* మనువాద స్మృతి ఆచరించే వారి సంఖ్య మాలల్లో పెరిగింది
* అంబేడ్కర్ రాసిన మొదటి సంపుటి చదువుకోవాలి
* ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దళిత వర్గాల హక్కులకు, ఆత్మగౌరవానికి అడ్డు తగిలేవారిని మనువాదులుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ (AMBEDHKAR) పోల్చారని, దళిత వర్గానికే చెందిన మాలల్లో మనువాద స్మృతి ఆచరించే వారి సంఖ్య పెరుగుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ(MANDA KRISHNA MADIGA) మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. మాదిగల రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్(SOMAGIGUDA PRESS CLUB)లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ రాసిన మొదటి సంపుటి రచనలు – ప్రసంగాలను మాల సామాజికవర్గంలో మేధావులుగా చెప్పుకునే వారు చదవాలని సూచించారు. అంబేడ్కర్ రాసిన ఈ పుస్తకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠిలో ముద్రిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి ప్రభుత్వం హయాంలో బొజ్జా తారకం ఆధ్వర్యంలో దీన్ని ఉన్నది ఉన్నట్టు రాశారని వెల్లడించారు.
జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కోరకూడదని, ఇతర ఏ అల్ప సంఖ్యాక వర్గాలకు నష్టం కలిగించేలా వ్యవహరించకూడదని. ఏ అల్ప సంఖ్యాక వర్గం కూడా తమ సంఖ్యకు మించి ఉద్యోగ అవకాశాలు కోరకూడదని, దళితుల్లోని వర్గాలు అందరికీ వారి ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదాను బట్టి నిష్పత్తిలో పంపకాలు చేయాలని అంబేడ్కర్ రాసిన మొదటి సంపుటిలోని అంశాలను మంద కృష్ణ చదివి వినిపించారు. తాము అడుగుతున్నది పంపకమే కదా అని అన్నారు. దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేడ్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడమే అని తెలిపారు. దళితుల్లోని ఒక వర్గం అభ్యున్నతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మార్పీఎస్(MRPS) ఉద్యమ నాయకత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడం తగదన్నారు.
…………………………………