
* దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదనీ, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో పైకి ఎదగాలనీ రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగులు సాదారణ వ్యక్తులకంటే ఎంతో అసాధారణ ప్రతిభావంతులుగా ఉంటారన్నారు. దివ్యాంగులు గొప్ప త్యాగ గుణం కలవారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వారు ఆత్మస్థైర్యంతో పైకి ఎదగాలని, వాళ్ళ కాళ్లపై వారు నిలబడేలా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ఒక ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, బైక్ లు, లాప్ టాప్ లు, వినికిడి యంత్రాలు వంటి వివిధ ఉపకరణాలను అందించడం జరుగుతుందని, అందులో భాగంగా అలింకో సంస్థ ద్వారా దాదాపు 63 లక్షల రూపాయల విలువచేసే సహాయ పరికరాలను కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని, వారికి కేటాయించిన కోటా ప్రకారం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటరీ సభ్యులు బలరాం నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను, సహకారాన్ని అందిపుచ్చుకొని అందరికీ స్ఫూర్తిదాయకంగా ఎదగాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ దివ్యాంగులు ఈ సమాజానికి ఎంతో విలువైన ఆస్తి అని వారి ఎదుగుదలకు సహకరించాల్సిన భాధ్యత సమాజంలో అందరిపైనా ఉందని అన్నారు. దివ్యాంగులలో ఆత్మ స్థైర్యం నింపేలా, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా స్థాయిలో దివ్యాంగులకు క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం దివ్యాంగుల క్రీడల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణించిన విజేతలను మంత్రి సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆయా సంఘాల జిల్లా, రాష్ట్ర స్థాయి భాద్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ , సంపత్ రావు , ఆర్డీఓ వెంకటేష్, డిడబ్లుఓ శిరీష, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన శ్రీనివాస్, సంఘం రాష్ట్ర జిల్లా భాద్యులు పూజారి మాణిక్యం, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి, మహిళా సాధికారత కేంద్రం డీఎంసీ రమాదేవి, సీహెచ్ఎల్ కోఆర్డినేటర్ నరేష్, సఖి కేంద్రం సీఏ లావణ్య, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు, జిల్లాలోని దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలి : మంత్రి సీతక్క
ప్రతి ఒక్కరు సన్మార్గంలో పయనించాలని సూచించిన గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తు అని, ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ నెల 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జిల్లా కేంద్రంలో లీలా గార్డెన్లో క్రిస్మస్ పండగ ఉత్సవాలను నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ లతో కలిసి రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని మతాల వారికి సమాన హక్కులు కలిగి ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించారని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. దేశంలో ప్రపంచంలో విశ్వశాంతి కోసం ఏసుక్రీస్తు ప్రార్థనలు చేశారని, ఆయన ప్రార్థన ద్వారా శాంతి నెలకొందని తెలిపారు. దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగిన మన రాష్ట్ర తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు సైతం ఏసుక్రీస్తును కొనియాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడడంలో అనేక చర్యలు తీసుకున్నారని, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోనే ప్రతి ఒక్కరు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. హిందువులు భగవద్గీత, క్రిష్టియన్ లు బైబిల్, ముస్లింలు ఖురాన్ లో పేర్కొన్న అంశాలను పాటిస్తారని, వారి వారి మతాలను గౌరవిస్తూ ముందుకు పోతున్న ప్రతి వ్యక్తి అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోవాలని ఉద్దేశంతో ముందుకు సాగుతూ సంక్షేమ ఫలాలను చేపడుతూ అన్ని మతాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందోనని, రానున్న సంవత్సరంలో జరగనున్న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్ , మైనార్టీ సంక్షేమ అధికారి రవీందర్ రెడ్డి, తహసిల్దార్ విజయభాస్కర్, పాస్టర్లు సుదర్శన్ రావు, రవి ఐజయ్య, బి. పాల్, అశోక్ అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………