UTF Demands Pending DA PRC
* పెండింగ్ డీఏలను, పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి
-ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఐదు పెండింగ్ డీఏలను, పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పాత బకాయి కరువుభత్యాలు తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన కరువుభత్యం ఒక్కటి కూడా ఇవ్వలేదని ఇప్పటికీ 5 విడుతల డీఏ బకాయి ఉన్నదన్నారు. పీఆర్సీ కూడా ఈ ఏడాది జులై ఒకటి వస్తే మూడు సంవత్సరాలు పూర్తవుతుందని విమర్శించారు. పాఠశాలలు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మీద శీతకన్ను వేస్తూ కొత్త కొత్త పాఠశాలల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలు అటకెక్కిందని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పోస్టులు ఎంఇఓ, డిప్యూటీ ఈఓ, డీఈఓ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డైట్ కళాశాలలు, బీఎడ్ కళాశాలలో జూనియర్ కాలేజీల్లో స్కూళ్లలో ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉందన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ అందించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈహెచ్ఎస్ పకడ్బందీగా అమలు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఆరోగ్య భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. జులై నెలలో సంఘ సభ్యత్వాలు జిల్లా లోని పన్నెండు మండలాల్లో త్వరితగతిన పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు.
సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, జిల్లా కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ నిధి జిల్లా కన్వీనర్ గూడెల్లి కృష్ణ,?జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్, శ్రీహరి, తోట వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, బాలక్రిష్ణ, దేవీసింగ్ తదితరులు పాల్గొన్నారు.
