Telangana HAM Road Project
ఆకేరు న్యూస్, నల్గొండ:
తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రవాణా విప్లవానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ (HAM) రహదారుల నిర్మాణ పనులను ఆయన ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి, ఈ మెగా రోడ్డు ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు.
* రూ. 13.06 వేల కోట్లతో మహా ప్రాజెక్టు..
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మొత్తం రూ. 13,060 కోట్ల భారీ అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక రహదారులను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం రోడ్ల సంఖ్య -441 రహదారులు, మొత్తం పొడవు- 6,092 కిలోమీటర్లు. పనులను వేగవంతం చేసేందుకు మొత్తం ప్రాజెక్టును 34 ప్యాకేజీలుగా విభజించారు.
ఈ విస్తరణ పనుల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడమే కాకుండా, ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. వాణిజ్యపరంగా కూడా ఈ రోడ్ల అభివృద్ధి తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుంది.
* సమీక్షలు – హాజరైన ప్రముఖులు..
కనగల్లో జరిగిన ఈ ఘనమైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), మరియు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై ప్రాజెక్టు వివరాలను సమీక్షించారు.
* ప్రజలతో మమేకమైన సీఎం..
పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలతో ముచ్చటించారు. సభకు తరలివచ్చిన స్థానికులను పలకరిస్తూ, వారితో కరచాలనం (Handshake) చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. సీఎంను నేరుగా కలిసే అవకాశం రావడంతో స్థానిక ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

