
* నడ్డా నివాసంలో ఎన్టీఏ పక్షాల భేటీ
* అమిత్ షా, చంద్రబాబు తదితరుల హాజరు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్ లోపల, బయటా మిత్రపక్షాల సమన్వయం మరింత పెంచుకోవడంపై ఎన్డీయే పక్షాలు దృష్టి సారించాయి. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే పక్షాల ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి, తదితరులు హాజరయ్యారు. అంబేడ్కర్పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్లో రేగిన దుమారం సహా పలు రాజకీయ అంశాలపై ఎన్డీయే నేతలు చర్చించినట్టు సమాచారం. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయం ఆవశ్యకతపై చర్చించినట్టు సమాచారం. ఎన్డీయే భేటీ తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
సుమారు 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి.. సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను గ్టటెక్కించడంపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న వారిలో జేడీయూ నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్, అప్నాదళ్ అధ్యక్షురాలు, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్, జేడీఎస్ నేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, హిందుస్థానీ అవామ్ మోర్చా నేత, ఆర్ఎల్ఎం అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లి తదితరులు హాజరయ్యారు.
……………………………………………….