
-ఇందిరమ్మ రాజ్యమంటేనే రాక్షస పాలన
-ప్రజాపాలనంటే ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పడమా?
-ఇది రేవంత్ రెడ్డి వైఫల్య పాలన
-శాంతి భద్రతలు నిల్..ప్రజాస్వామ్యం కిల్
-నియంతలా రేవంత్..తెలంగాణ పరువు గల్లంతు
-కాంగ్రెస్ ఆరాచక పాలనను అడ్డుకుంటాం
-అక్రమ కేసులు, అరెస్టులకు గులాబీ శ్రేణులు భయపడవు
-బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
తెల్లారక ముందే పోలీసులు శ్రీనివాస్ ఇంటిని చుట్టుముట్టి అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. కుటుంబ సభ్యులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు అందించకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాపాలన అని సొల్లు కబుర్లు చెబుతూ రాక్షస పాలన సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలను గల్లంతు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం గల్లంతు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే రాక్షస పాలన అన్నారు. ప్రజాపాలనంటే ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పడమా? అని నిలదీశారు. ఇది రేవంత్ రెడ్డి వైఫల్య పాలన, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు నిల్. ప్రజాస్వామ్యం కిల్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారు రాక్షస ఆనందం ఎక్కువ కాలం నిలవదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉడుత ఊపులకు, బెదిరింపులు, అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడే పార్టీ కాదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సమాజమే కాంగ్రెస్ ను తరిమికొట్టే రోజు ఎంతో దూరం లేదన్నారు. కాంగ్రెస్ ఆరాచక పాలనను అడ్డుకుంటామన్నారు. అక్రమ కేసులు, అరెస్టులపై గులాబీ శ్రేణులు తిరగబడితే కాంగ్రెస్ పారిపోక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
……………………………………