
– వెయ్యి గొంతులు, లక్ష డప్పుల ప్రదర్శనలో పాల్గొంటాం.
– హైదరాబాద్ లో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అధ్యక్షతన సమావేశం జరిగిన సమావేశంలో కళానేతలు
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : ఎస్సీ వర్గీకరణ కోసం గళం విప్పి గజ్జె కడుతామని తెలంగాణ కళాకారులు శపథం చేశారు. హైదరాబాద్ లో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ కళానేతలను ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ కులానికి అన్యాయం జరగదని, జనాభా ప్రాతిపదికన ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్లు లభిస్తేనే అన్ని ఉప కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ పోరాటం న్యాయమైంది కాబట్టి సమాజం మొత్తం మద్దతు ఇచ్చిందన్నారు. కానీ మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అడ్డంకులను ఎదుర్కోవడానికి వెయ్యి గొంతులు, లక్ష డప్పులతో మండే మాదిగల గుండె చప్పుళ్ళును వినిపించడానికి శ్రీకారం చుట్టామనిన్నారు.
మరొక్కసారి అన్ని సామాజిక వర్గాలలో ఉన్న కళా నేతలంతా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని మంద కృష్ణ మాదిగ అభ్యర్థించారు. .ఫిబ్రవరి 3 న జరుగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో కళానేతలు మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టే మొదటి నుండి ఎమ్మార్పీఎస్ కు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఎంతటి బలమైన పాత్రని కళానేతలు పోషించారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని విజయానికి చేర్చడానికి కూడా అదే పాత్రను పోషిస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరొక్కసారి గజ్జె కట్టి గళం విప్పి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం నూతన పాటలతో ప్రజల్ని మరింత చైతన్యం చేస్తామన్నారు.అందులో భాగంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులంతా పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని విమలక్క, మధుప్రియ, నల్లగొండ గద్దర్, దరువు అంజన్న ,వరంగల్ శ్రీనన్న, రేలారే గంగ, మిట్టపల్లి సురేందర్, క్రాంతి దళ్ పృథ్విరాజ్ యాదవ్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, పాటమ్మ రాంబాబు, దరువు ఎల్లన్న , రేలారే ప్రసాద్ , ఐలయ్య, యాకన్నలతో పాటు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ప్రముఖ కళానేతలు పాల్గొన్నారు.
………………………………………………