
* రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేలు చేయాలి
* కేసీఆర్ పథకాలను కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: నీళ్ళ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు – నిజాలు’పై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని.. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారని.. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధిహామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తుచేశారు. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారని.. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించామని వెల్లడిరచారు. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశామని కవిత తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే… ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యిందని విరుచుకుపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశారని.. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని.. కానీ తెలంగాణ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నీళ్లు ఇవ్వక రైతుల పొట్టకొడుతున్నారని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తి అయ్యిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదని కవిత విమర్శలు చేశారు.
…………………………………………..