![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/tet.jpg)
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్లో టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే… ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,05,278 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో పేపర్-1లో 69,476 మంది అభ్యర్థులకుగాను 41,327 (59.48 %) మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్-2లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,390 మంది పరీక్షకు హాజరుకాగా.. 23,755 (34.24 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్లో 66,412 మందికిగాను.. 18,629 (28.205 %) మంది అర్హత సాధించారు. మొత్తానికి పేపర్-1, పేపర్-2 రెండూ కలిపి 2,05,278 మంది పరీక్షలకు హాజరుకాగా.. 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో టెట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీని విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్లు, సబ్జెక్టులవారీగా అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయి. టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ జనవరి 24న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 25 నుంచి 27న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించింది. టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు – 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 90గా, బీసీలకు 75గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 60గా నిర్ణయించారు. తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్, పీజీ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. త్వరలోనే దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటించనున్నారు. టీజీ ఎప్సెట్-2025 ఫిబ్రవరి 20న, పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది.
……………………………………………..