
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేటు పీకెళ్లారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా అని మండిపడ్డారు. నాటి కాంగ్రెస్ (Congress)పాలనలో.. అన్నదాతలు అప్పు కట్టలేదని.. ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి.. రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి.. కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి ఉండేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చిందని అన్నారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని, ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా అని కేటీఆర్ మండిపడ్డారు. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రి(Chiefminister)పై చర్య తీసుకునే ధైర్యముందా అని బ్యాంకు అధికారులను నిలదీశారు. రైతులు అంతా గమనిస్తున్నారని, ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరని.. గుర్తుపెట్టుకోండి.. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరని పేర్కొన్నారు.
………………………………..