
* నడుం వంచుతున్న భారతీయులు
* అంతర్జాతీయ యోగాకు సన్నద్ధం
* తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ఏర్పాట్లు
* రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వయసులో కూడా అంత ఈజీగా, హుందాగా నడుస్తుండడంతో పాటు, దేశాన్ని నడిపిస్తున్నారంటే అందుకు ఆయన దినచర్యలో యోగా ఓ భాగం కావడం కూడా కారణమే. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంత దోహదపడుతుందో ఆయనే ఒక చక్కటి ఉదాహరణ. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న మన ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో దీన్ని తీర్మానించారు. ఈ తీర్మానానికి 193 మంది ఐక్య రాజ్య సమితి ప్రతినిధులలో ఏకంగా 175 మంది మద్దతు ఇచ్చారు. విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ 2014 లో ఆమోదించారు. 2015 జూన్ 21 న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అక్కడి నుంచి ఏటా ఆ తేదీన జరుపుకుంటూనే ఉన్నారు.
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికా నుంచి తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి వరకూ ఇలా అన్నిచోట్లా భారతీయులందరూ నడుం వంచేందుకు సిద్ధం అవుతన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయ పరిచారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అని అన్నారు. యోగా సాధనలో చిన్నారులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
నేడు హైదరాబాద్లో..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 24 గంటల ముందు ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్డౌన్ పేరుతో మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 5.30కు ఈ కౌంట్డౌన్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ శాఖ మంత్రి శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సినీ నటి కుష్బూ, మీనాక్షి చౌదరి, సాయిధరమ్తేజ్, తేజ తదితరులు పాల్గొననున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి గురువారం సాయంత్రం స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వికసిత్ భారత్గా అభివృద్ధి చెందాలంటే ప్రతీ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రధాని మోదీ ఆశయమని కిషన్రెడ్డి అన్నారు.
రేపు విశాఖపట్టణానికి మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఈనెల 21న విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. మోదీ ఈ నెల 20న సాయంత్రం భువనేశ్వర్ వస్తారు.. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రాత్రికి తూర్పునౌకాదళం గెస్ట్ హౌస్లో బస చేస్తారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. శనివారం (21న) ఉదయం 6:30 నుంచి 7:45 గంటల వరకు విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. అనంతరం ఉదయం 11:50 గంటలకు విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళతారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
…………………………………………………….