
* మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్
* చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల వేషం వేసుకున్నకొంత మంది మీడియా సంస్థల యజమానులు కొద్ది నెలలుగా కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(PHONE TAPPING CASE)లో బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు కూడా జరగొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి ఫోన్ ట్యాపింగ్పై కొంతమంది బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూ.. టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి.. వారిని లోబర్చుకోవాలని ప్రయత్నించారంటూ తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రచారంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. కొంతమంది మీడియా సంస్థల యజమానులు తనపైనా, తమ పార్టీపైనా విషం చిమ్ముతున్నారన్నారు. పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన తనపైనే కాకుండా, తమ కుటుంబసభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా బుద్దిచెబుతామన్నారు.
…………………………………..