
* మాగంటి మృతితో ఉప ఎన్నిక అనివార్యం
* ఉప ఎన్నికపై ఉత్కంఠ
* బీఆర్ ఎస్ సీటుపై కాంగ్రెస్ కన్ను
* గులాబీ కోటలో హస్తం పాగా వేసేనా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో నాటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 2024న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్నారాయణ్ తన సమీప బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్పై 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు గెలవలేని ఆ పార్టీ.. ఉప ఎన్నికలో గెలుపొంది ఖాతా తెరిచింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కూడా అనివార్యమైంది. నాటి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ను కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధం అవుతోంది. అధికారంలో ఉన్న ఆ పార్టీ ఈ సీటును కూడా గెలుపొందుతుందా… లేదా.. అనేది ఆసక్తిగా మారింది. ఏడాదిన్నర కాంగ్రెస్ పనితీరుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కొలమానంగా మారనుంది.
గెలిపించేది మైనార్టీలే.. గెలిచేది ఎవరు?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లే ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనార్టీ నేతగా అజహరుద్దీన్ ను బరిలోకి దింపింది. అయితే స్థానికంగా నాటి బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు ఉన్న బలం ముందు ఆయన గెలవలేక పోయారు. 16 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థికి 7,848 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో మాత్రం ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకు ఎంత? ఎవరిని నిలిపితే ఓట్లు పెరుగుతాయో అధినాయకులు ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు. గెలిచే వ్యక్తికే సీటు ఇవ్వాలని భావిస్తోంది.
ఆశావహులు ఎవరంటే..
అధికార పార్టీ కావడంతో ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి అజహరుద్దీన్ తో పాటు, కాంగ్రెస్ మైనార్టీ నేత ఫయూమ్ ఖురేషీ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, కాంగ్రెస్ నేత నవీన్యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. నేతలు కూడా నియోజకవర్గంలో గెలుపు అవకాశాలపై సర్వేలు చేయించుకుంటున్నారు. అజహరుద్దీన్ అయితే తనకే ఆ సీటు అని ఇప్పటికే ప్రకటించారు. అయితే డీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాత్రం ఇంకా ఎవరికీ టికెట్ ప్రకటించలేదని తెలిపారు. ఆశావహుల నుంచి త్వరలోనే దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు.
అధికార పార్టీ ఆరాలు మొదలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మిగతా పార్టీల బలం ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, సిట్టింగ్ పార్టీ బీఆర్ఎస్ ఏ ప్రాంతంలో బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది.. దాన్ని ఢీ కొట్టాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి అనేది ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రకటన వస్తే.. సర్వేల ఆధారంగా అధిష్ఠానం టికెట్ ఖరారు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి నుంచే జూబ్లీహిల్స్ పై దృష్టి సారించిన అధికార పార్టీ ఉప ఎన్నికలో పోటీకి నిలబడితే గెలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
………………………………………………..