
* రథాలు వచ్చే సమయంలో అపశ్రుతి
ఆకేరు న్యూస్, డెస్క్ : పూరీ జగన్నాథ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద తోపులాట జరిగి ముగ్గురు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ ఖురానియా తోపులాట జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఉదయం 4 గంటలకు దేవతామూర్తుల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గుండీచా ఆలయానికి రథాలు చేరుకునే సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆలయానికి జగన్నాథ్, బలబద్రుడు, సుబద్రాదేవి రథాలు వచ్చినప్పుడు తాకిడి మరింత పెరిగింది. అప్పుడు తోపులాట జరిగి ముగ్గురి మృతికి కారణమైందని పేర్కొంటున్నారు. మృతులు ఖుర్జా జిల్లాకు చెందిన ప్రబతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ గా గుర్తించారు. రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచలేదని పేర్కొంటున్నారు.
……………………………………………………