* కుత్బుల్లాపూర్ డీసీకి నిరసన సెగ
* ఆయన చాంబర్లో కింద కూర్చుని ఆందోళన
ఆకేరు న్యూస్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఆర్నాయక్ నగర్ కాలనీలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. రోజుల తరబడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించండి మహాప్రభో.. అని అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. రోగాల బారిన పడుతున్నాం.. తగి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అయినా అధికార యంత్రాంగం స్పందించలేదు. దీంతో సోమవారం జరిగిన ప్రజావాణి వేదికగా సాక్షిగా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్నాయక్ నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు ఉప కమిషనర్ నర్సింహ చాంబర్లో కింద కూర్చుని నిరసన తెలిపారు. ప్రధానంగా పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని తెలిపినా మీరు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని డీసీని నిలదీశారు. ఎంతో మంది అనారోగ్యాలకు గురవుతూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని డీసీ హీమీనివ్వడంతో నిరసనను విరమించారు.
సమస్యలన్నింటినీ పరిష్కరించాలి..
కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. రెండు సర్కిళ్లలో మొత్తం 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. గాజులరామారం సర్కిల్లో ఇంజినీరింగ్ విభాగానికి 8, విద్యుత్ విభాగానికి 2, టౌన్ ప్లానింగ్ విభాగానికి 1 దరఖాస్తు వచ్చినట్లు డీసీ మల్లారెడ్డి తెలిపారు. అదే విధంగా కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఇంజినీరింగ్ విభాగానికి 12, పారిశుధ్య విభాగానికి 3, టౌన్ప్లానింగ్, రెవిన్యూ విభాగాలనకు 2, విద్యుత్ విభాగానికి ఒక దరఖాస్తు వచ్చినట్లు డీసీ నర్సింహ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
