* హరీష్రావు బీనామీకే..
* వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు
* జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులున్నా.. అభివృద్ధి శూన్యం..
ఆకేరు న్యూస్, వరంగల్ : ప్రజా సమస్యలపైనే జాగృతి జనం బాట పట్టిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. జనం బాటలో భాగంగా వరంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని అన్నారు. ప్రోటోకాల్ నిబంధనలతో తనను కట్టేశారని చెప్పారు. అందుకే జనంలో తిరగలేక పోయానని అన్నారు. అకాల వర్సాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం 15 రోజులైనా ఇంకా అందివ్వకపోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కూతురునైనా పనులు కాలేవన్నారు. కాలేజీ అనుమతి కోసం సంవత్సరం తిరిగానని గుర్తు చేశారు. ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని చెప్పారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో VTDA ద్వారా టెండర్లు ఇచ్చారని.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మంత్రి సీతక్క మౌనంగా ఉండడం సరికాదని చెప్పారు.
జిల్లా అభివృద్ధిలో.. కానరాని మహిళా మంత్రులు..
జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారని అయినా ఏం లాభం..? అభివృద్ధిలో మంత్రుల జాడ లేకుండా పోయిందని కవిత అన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లేకపోవడం దారుణమని చెప్పారు. సమ్మక్క – సారక్క లెక్క జిల్లాలో మంత్రులు సీతక్క, సురేఖ ఉన్నారని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి ఎంజీఎంను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఎంజీఎంను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కడుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నది హరీష్ రావు కాంట్రాక్టు కంపెనీ అట కదా! అంటూ వ్యాఖ్యానించారు. అధికార..రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని ప్రజల సమస్యలు పట్టించుకునే నాయకులే లేరని.. అందుకే నేను ప్రజల వద్దకు వచ్చానని చెప్పారు.
………………………………………..
