* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు; స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి, “నేషినల్ ఎడ్యుకేషన్ డే”, “మైనారిటీ వెల్ఫేర్ డే” 11th నవంబర్ ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో జయంతి ఉత్సవ సంబరాలను నిర్వహిస్తుందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ తదితర అనేక భాషల్లో ప్రావీణ్యత పొందారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని, ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచి అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు పనిచేసిన మౌలానాకు మరణాంతరం 1992లో భారతరత్న పురస్కారం లభించిందన్నారు. విద్య లేకుండా దేశము అభివృద్ధి చెందదని, విద్య స్వాతంత్రానికి రెండో రూపముగా పేర్కొన్న మౌలానా భారత విద్యావ్యవస్థకు బలమైన పునాదివేసిన మహానుభావుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సర్దార్ సింగ్, డి ఎం రాంపతి, డి పి ఆర్ ఓ రఫిక్, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, పర్యవేక్షకులు మహేష్ బాబు, మంజుల, సలీం, రవీందర్, కలెక్టరేట్ కార్యాలయాల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….
