* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ఆకేరు న్యూస్, మెదక్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అంజనేయులు (మాజీ ZPTC), శరత్ చంద్ర, మల్లేశం, నర్సింహారెడ్డి, అరవింద్ బాబు మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ‘నయవంచన’, ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర ఆ పార్టీది. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. ఏ ఒక్కరికీ మేలు జరగలేదు. బీఆర్ఎస్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో పయనిస్తోంది.కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే పరిమితమయ్యాయి. వృద్ధులకు రూ.4000 పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు.. ఇలా అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. రేవంత్ రెడ్డి పాలనలో “కరెంటు నుండి కాంటా దాకా” రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేక, ధాన్యం దళారుల పాలవుతున్నది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ మోసాలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు.
……………………………………………….
