* ప్రధాన రోజుల్లో తాను అందుబాటులో ఉండలేనని ముందస్తు మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
* ఈ నెల 18న సీఎం తొలి మొక్కులు సమర్పణ
* ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ జాతర ఏర్పాట్ల పరిశీలన
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే, ఈసారి జాతర ప్రధాన రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండటం లేదు. ఆయన ప్రస్తుతం ప్రత్యేక కోర్సు నిమిత్తం అమెరికా పర్యటనలో ఉండటమే దీనికి కారణం. సాధారణంగా జాతర ఉధృతంగా ఉన్న సమయంలో, అమ్మవార్లు గద్దెపైకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. జాతర సమయంలో తాను అందుబాటులో ఉండలేనన్న ఉద్దేశంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ నెల 18వ తేదీనే మేడారం చేరుకున్నారు. జనవరి 19న వారు అక్కడ నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం తొలి మొక్కులు సమర్పించి, అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి లేని లోటు కనిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆమె అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి, జాతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
………………………………………
