ఆకేరు న్యూస్, డెస్క్ :తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణలో బీజేపీ ఎంత పోరాటం చేసినా అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ వంటి చోట్ల ఆ పార్టీ ఉనికే లేదని ఎద్దేవా చేశారు. అక్కడ పోటీ కేవలం కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యే ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై స్పందిస్తూ.. ఇంకా రెండు డీసీసీ అధ్యక్ష పదవులు, అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలి ఎంపిక పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యారని విమర్శించారు. అలాగే, ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనీ కోల్ బ్లాక్ అంశం కేవలం మీడియా సృష్టేనని, కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల్లో ఈ ప్రస్తావనే రాలేదని ఆయన కొట్టిపారేశారు.
………………………………………………..
