ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి మేడారం చేరుకున్న భక్తులు అమ్మవార్ల ఆశీస్సుల కోసం మూడు రోజులపాటు మేడారం పరిసర ప్రాంతాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు ప్రాంతాలలో బస చేశారు. బుధవారం సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు, గురువారం సమ్మక్క దేవత గద్దెలపై చేరుకోవడంతో భక్తులు బస చేసిన గుడారాలలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి దేవతల గద్దెలను దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం పసుపు కుంకుమ బంగారం చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ తమ గుడారాలకు చేరుకొని శనివారం అమ్మవారికి అత్యంత ప్రతి కరమైన నైవేద్యాలు వండి ఆరగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో విందు భోజనాలు చేశారు. శనివారం సాయంత్రం అమ్మవార్లు గద్దెల నుంచి సమ్మక్క చిలకలగుటకు, సారలమ్మ, కన్నెపల్లి ,గోవిందరాజులు కొండాయి, పగిడిద్దరాజు పోనుగొండ్ల కామారం ఆయా గ్రామా లకు తరలి వెళ్లడంతో భక్తులు మేడారం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు .దీంతో మేడారం పరిసరాలు బోసిపోతున్నాయి. ఖాళీ గుడారాలు దర్శనమిస్తున్నాయి . నాలుగు రోజులపాటు కళకళలాడిన మేడారం పరిసరాలు అందవికారంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ భక్తులు తమ స్వగ్రామాలకు తిరిగి సంతోషంగా వెళుతున్నారు.

……………………………………….
