*అత్యాచార ఘటనపై ఎంపీ కావ్య సీరియస్…
ఆకేరు న్యూస్,జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.జరిగిన ఈ అత్యాచార ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు.ఈ అమానుషానికి పాల్పడిన శ్రీకాంత్, గణేష్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కావ్య పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులపై వెంటనే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టును ఆశ్రయించాలని, బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్వయంగా వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.చిన్నారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.బాధిత కుటుంబం అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.నేరగాళ్లను ఉపేక్షించేది లేదని, చిన్నారులపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఎంపీ స్పష్టం చేశారు. సమాజంలో మహిళలు, చిన్నారులకు భద్రతా వాతావరణం కల్పించడమే తమ ప్రాధాన్యతని, నేరగాళ్లకు ఇదొక హెచ్చరిక కావాలని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.
