*పోక్సో కేసు నమోదు
ఆకేరు న్యూస్,ఘట్కేసర్: గురువు అంటే విద్యాబుద్ధులు నేర్పించి మార్గదర్శిగా నిలవాలి. కానీ, తన వద్ద చదువుకునే మైనర్ విద్యార్థినిపై కన్నేసి, నమ్మించి, మోసపూరితంగా తాళి కట్టాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పరే మైతీ (27) అనే వ్యక్తి ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై అతను గత కొంతకాలంగా కన్నేశాడు. తరచూ ఆ బాలికను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు.ఈ క్రమంలోనే సదరు విద్యార్థినిని మాయమాటలతో నమ్మించి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆమె మెడలో పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకున్నాడు.బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మెడలో పసుపు తాడు ఉండటాన్ని గమనించిన తల్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కూతురిని గట్టిగా నిలదీయడంతో, జరిగిందంతా వివరించింది. వెంటనే తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, పాఠశాల బయట జరిగే విషయాలతో తమకు సంబంధం లేదంటూ ప్రిన్సిపాల్ బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడుపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన స్కూల్ మేనేజ్మెంట్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
