* కేంద్రం కీలక నిర్ణయం..
* అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు..
* నిరసిస్తూ వైసీపీ వాకౌట్!
* ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి
* చట్ట సవరణతో ముగిసిన పదేళ్ల సందిగ్ధత
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కేబినెట్, దానికి ఆమోదం తెలపడమే కాకుండా వెంటనే పార్లమెంటరీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం (ఏప్రిల్ 01, 2026) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ **‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026’ ను లోక్సభలో ప్రవేశపెట్టారు.
* లోక్సభలో కీలక పరిణామాలు – కాంగ్రెస్ మద్దతు:
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో అనూహ్య రాజకీయ సమీకరణాలు కనిపించాయి. అధికార పక్షం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం ఎక్కడని ప్రశ్నిస్తూనే, రాజధానిగా దానికి చట్టబద్ధత కల్పించడాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అలాగే ఏపీకి రావాల్సిన పన్ను రాయితీలు, పరిశ్రమల ప్రోత్సాహకాలు మరియు పెండింగ్లో ఉన్న ప్రత్యేక హోదాపై కూడా కేంద్రం త్వరగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
* వైసీపీ తీవ్ర వ్యతిరేకత – వాకౌట్:
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని నిర్ణయమన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని, గతంలో కేంద్రం ఇదే విషయాన్ని హైకోర్టులో అఫిడవిట్ రూపంలో తెలిపిందని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతిపై కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను కూడా ఇంకా పూర్తిస్థాయిలో కేటాయించలేదని విమర్శించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని చెప్తూనే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు సరికాదని పేర్కొంటూ నిరసనగా లోక్సభ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
* బిల్లులోని ప్రధానాంశాలు మరియు చట్టపరమైన మార్పులు..
2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరిస్తూ.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్కు ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున, ఆ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి’ని అధికారికంగా చేర్చారు. ఈ సవరణ చట్టం జూన్ 2, 2024 నుంచే అమలులోకి వచ్చేలా (Retrospective effect) నిబంధనలను రూపొందించారు. దీనివల్ల గడిచిన రెండేళ్ల పరిణామాలు కూడా చట్టబద్ధం అవుతాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, రాజధానిని మార్చడం అంత సులభం కాకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. లోక్సభ ఆమోదం పొందిన అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందాక రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
* కూటమి నేతల స్పందన:
ఈ బిల్లుపై జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాద్, బీజేపీ నుంచి పురందేశ్వరి, సీఎం రమేష్ మరియు జనసేన నుంచి బాలశౌరి పాల్గొన్నారు. అమరావతి ఆవశ్యకతను మరియు దాని భవిష్యత్తును వివరిస్తూ వారు ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
ఈ చట్టబద్ధతతో అమరావతి కేవలం ఒక ప్రాంతంగా కాకుండా, అంతర్జాతీయ స్థాయి రాజధానిగా ఎదిగేందుకు ఉన్న అన్ని చట్టపరమైన అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోనున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
