Modi women reservation 2029
* మోదీ కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, డెస్క్: భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 21వ శతాబ్దం పూర్తిగా మహిళా శక్తికి సంబంధించిందని, వారి భాగస్వామ్యంతోనే దేశం మరింత బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రాముఖ్యతను వివరించారు.
* కొత్త చరిత్రకు చేరువలో పార్లమెంటు:
“పార్లమెంటు ఒక గొప్ప చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. భారత ప్రజాస్వామ్య పునాదులను మహిళలు మరింత పటిష్టం చేస్తారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు సాకారమవుతోంది. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, దేశాభివృద్ధిలో మహిళలకు ఇచ్చే గొప్ప గౌరవం” అని మోదీ పేర్కొన్నారు.
* 2029 నాటికి అమలు:
మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా 2029 నాటికి ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మహిళా సాధికారతతోనే నవ భారత్ నిర్మాణం సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
