Telangana Assembly modernization plan
* సెంట్రల్ హాల్, మెంబర్స్ క్లబ్ ఏర్పాటుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని దేశ రాజధానిలోని పార్లమెంట్ భవనం తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సభ్యులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఈ పనులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
* పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్….
ఢిల్లీలోని పార్లమెంట్ భవనం మాదిరిగానే, మన రాష్ట్ర శాసనసభలో కూడా సభ్యుల కోసం ప్రత్యేకంగా సెంట్రల్ హాల్ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సభ్యులు పరస్పరం చర్చించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఒక వేదికగా నిలవనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికే ఈ పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.
* సభ్యుల ప్రైవసీ మరియు మెంబర్స్ క్లబ్…
సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు పూర్తి స్థాయిలో ప్రైవసీ ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని సీఎం సూచించారు. సభ్యుల గౌరవం పెంచేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. అలాగే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా ఒక మెంబర్స్ క్లబ్ ఏర్పాటు చేయాలని, అక్కడ వారికి అవసరమైన అన్ని ఆధునిక వసతులు కల్పించాలని అధికారులకు తెలిపారు.
* వారసత్వ సంపద పరిరక్షణ…
ప్రస్తుత శాసనసభ మరియు పాత మండలి భవనాలు చారిత్రక వారసత్వ కట్టడాలు. ఈ భవనాల నిర్మాణ శైలికి లేదా వారసత్వ సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆధునీకరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారు. చారిత్రక కట్టడాల వైభవం దెబ్బతినకుండానే కొత్త హంగులను అద్దాలని ఆయన వెల్లడించారు.
* ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్ మరియు క్రీడలు…
కేవలం వసతులే కాకుండా, సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజా ప్రతినిధుల ఫిట్నెస్ కోసం అసెంబ్లీ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, క్రీడల కోసం అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, తద్వారా సభ్యులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
* భద్రత మరింత పటిష్టం…
శాసనసభ ప్రాంగణంలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిఘా పెంచాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.
