PMJ Jewellery Robbery Karimnagar
* పీఎంజే జ్యువెలరీ ఘటనపై బండి సంజయ్ సీరియస్
* ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న పీఎంజే జ్యువెలరీలో జరిగిన సాయుధ దోపిడీ ఘటనలో దోపిడీ దొంగలు తప్పించుకునే అవకాశమే లేదని, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారని, కచ్చితంగా దొంగలు పట్టు పడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దొంగలు కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు.
ఘటన జరిగిన సమయంలో సమీపంలోనే ఉన్న ఆయన ఘటనా స్థలానికి చేరుకొని దాడిలో గాయపడ్డ వారితో పోలీసు వారితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దోపిడీ దొంగల దాడిలో నలుగురు గాయపడ్డారని, వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ తరలించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదుగురు దోపిడి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని, దోపిడీ దొంగలు పారిపోయే ప్రయత్నంలో ఒక బ్యాగును అక్కడే వదిలేసి వెళ్లిపోయారని బండి సంజయ్ అన్నారు.
మొదట షాప్ లోకి వచ్చిన దోపిడీ దొంగలు 20 గ్రాముల బంగారు చైన్ కావాలని అడిగారని, మంచినీరు అడిగారని ఇంతలో బయట నుంచి మరో ఇద్దరు వ్యక్తులు షోరూమ్ కు వచ్చారని షోరూం సెక్యూరిటీ వారిని ఆపడంతో తమకు బంగారం కావాలని అన్నారని , దాంతో వారు ఇద్దరు కూడా షాప్ లోకి వెళ్లి షోరూం లోని వారందరినీ మోకాళ్ళపై కూర్చోబెట్టి బ్యాండేజ్ తో నోరు మూసేసి, చేతులు కాళ్లు కట్టేసారని బండి సంజయ్ తెలిపారు. అయితే షోరూం లోని సేల్స్ మేనేజర్ మరో ఉద్యోగి ధైర్యంగా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సేల్స్ మేనేజర్ పై తలపైన, మిగతా వారి భుజాల పైన తుపాకులతో కాల్పులు జరిపారని బండి సంజయ్ తెలిపారు.
