Mulugu Floods Review Mock drill
ఆకేరు న్యూస్,ములుగు:
ప్రస్తుతం రాబోయే వర్షాకాలంలో జిల్లాలో అధిక వర్షపాతం వల్ల సంభవించే వరద పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ ,జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా తో కలిసి వరదల నిర్వహణకు నిర్వహించనున్న టేబుల్ టాప్ ఎక్సర్సైజ్, మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సంభవించే వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలు,సమన్వయ విధానాలపై విస్తృతంగా సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
15-05-2026 తేదీ శుక్రవారం రోజున నిర్వహించనున్న టేబుల్ టాప్ ఎక్సర్సైజ్, 18-05-2026 తేదీన సోమవారం రోజున నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాలకు వివేకానంద కాలనీ, కృష్ణన్ కాలనీ, పల్సాబ్ పల్లి, ములుగు ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని,వరదల సమయంలో చేపట్టవలసిన ఎవాక్యుయేషన్ చర్యలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్, అగ్నిమాపక శాఖ అధికారి నాగరాజు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
