cm vijay TamilNadu Liquor Rules
* 18 కాదు 21.. మద్యం అమ్మకాలపై సీఎం విజయ్ సంచలన ఆదేశాలు
* నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని నియంత్రించే దిశగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ఆయన, తాజాగా రాష్ట్ర మద్యం విధానంలో (Liquor Policy) కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
* వయోపరిమితి పెంపు…
ఇప్పటివరకు తమిళనాడులో మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయోపరిమితి 18 ఏళ్లుగా ఉండేది. అయితే, యువత మద్యం మహమ్మారికి బానిస కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ వయోపరిమితిని 21 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై 21 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వైన్ షాపులు, బార్లు మరియు పబ్స్లో అనుమతి ఉంటుంది.
* ఐడీ కార్డు తప్పనిసరి..
కొత్త నిబంధనల ప్రకారం, మద్యం కొనుగోలు చేసే సమయంలో వయస్సుపై అనుమానం వస్తే విక్రయదారులు తప్పనిసరిగా వయస్సు ధృవీకరణ పత్రాలను అడగాలి. కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ కార్డులలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. వయస్సు ధృవీకరించుకున్న తర్వాతే విక్రయాలు జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
* బోర్డుల ఏర్పాటుకు ఆదేశం…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్ షాపులు, బార్లు మరియు పబ్స్ ఎదుట “21 ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మబడదు.. లోపలికి ప్రవేశం లేదు” అనే బోర్డులను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ప్రభుత్వం యజమానులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
* మద్యం నియంత్రణ దిశగా అడుగులు…
నిన్ననే పాఠశాలలు, ఆలయాలు, బస్టాండ్లు మరియు ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వెనువెంటనే వయోపరిమితిని పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు మరియు మేధావుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో మద్యం వ్యాపారం ప్రభుత్వ సంస్థ (TASMAC) ద్వారానే జరుగుతుండటంతో, ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
