MULUGU SUDHEER PADDY PROCUREMENT
* రైతులకు అండగా ములుగు జిల్లా పోలీసులు
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలోని జంగాలపల్లి ధాన్యం ఆరబోసిన కల్లాన్ని జిల్లా ఎస్పి కేకాన్ సుధీర్ రామనాథ్, ములుగు డిఎస్పి రవీందర్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
రైతులు మాట్లాడుతూ, వడ్లను రైస్ మిల్లులకు తరలించేందుకు సరిపడా రవాణా సదుపాయాలు లేక ఆలస్యం జరుగుతోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎస్పికి వివరించారు. అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద కాంటా తూకంలో అధికంగా వడ్లు కట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రైతులకు తెలిపారు, రైతుల సమస్యల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రైతులకు అన్ని సమయాలలో అందుబాటులో ఉండాలని పోలీస్ అధికారులకు సూచించారు.
అనంతరం అబ్బాపూర్లోని శ్రీ మాతా ఆగ్రో టెక్ పారా బాయిల్డ్ రైస్ మిల్లును ఎస్పి పరిశీలించారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంటా తూకం యంత్రాన్ని, వడ్ల నాణ్యత తనిఖీ ప్రక్రియను పరిశీలించారు.
రైతుల నుండి సాధ్యమైనంత ఎక్కువ వడ్లు పారదర్శకంగా కొనుగోలు చేయాలని, తూకం విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యానికి ఎస్పి ఆదేశించారు తూకంలో తేడాలు గమనిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోగల వడ్ల కళాలను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ రోజువారి ఎగుమతి పై నివేదిక ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.
