Bhupalpally Women Child Protection
* మహిళలు, చిన్నారుల రక్షణకు శాఖల సమన్వయం కీలకం
– భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్.
అకేరు న్యూస్,భూపాలపల్లి : మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో భరోసా కార్యక్రమానికి సంబంధించి కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మహిళలు మరియు చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో బాధితులకు వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అలాగే మహిళలు, చిన్నారులపై నమోదవుతున్న కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు అవసరమైన సేవల కల్పన, రిఫరల్ వ్యవస్థ బలోపేతం, సంక్షేమ కార్యక్రమాల అమలులో శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు.
అదేవిధంగా బాధితులకు ఒకే వేదికపై అన్ని రకాల సహాయ సేవలు అందించే దిశగా భరోసా కేంద్రాల పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, కేసుల పరిష్కారంలో ప్రతి శాఖ తన బాధ్యతలను సమయానుకూలంగా నిర్వర్తించాలని సమావేశంలో సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్,ICPS అధికారులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు, CWC & JJB సభ్యులు, DLSA ప్రతినిధులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, SERP ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దర్యాప్తు అధికారులు,భరోసా ఎస్ఐ స్వప్న కుమారి, భూపాలపల్లి జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

