Shivunipalli School Repairs Demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
శివునిపెళ్లి హైస్కూల్లోని పల్లె ప్రకృతి వనాన్ని తొలగించి పాఠశాల భవనాలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివునిపెళ్లి ప్రభుత్వ పాఠశాలతో పాటు పట్టణ కేంద్రంలో ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలల సమస్యలపై సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ శివుని పెళ్లి ప్రభుత్వ పాఠశాల భవనాల్లో అనేక చోట్ల పెచ్చులు ఊడిపడుతున్నాయని, దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి భవనాలకు మరమ్మతులు చేయించాలని కోరారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ వనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు మంద మహేందర్, సిద్దుల సుదర్శన్, రంగరాయ గూడెం ఉపసర్పంచ్ మునిగే నరసింహులు, కత్తుల రాజు ప్రజా సంఘాల నాయకులు మంద ఇలిషన్, ఉమ్మగోని రాజు, నీరటి సంపత్, తాటికొండ నాగరాజు, అన్నెపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
