Classmates Donate ₹25,000 to Friend's Family
* కష్టం వస్తే చాలు మేము ఉన్నాం అంటు భరోసాగా నిలిచిన తోటి స్నేహితులు..
* స్నేహితుని కి ఆపద అంటే అండగా నిలుస్తున్న 2008- 09 లో పదవతరగతి చదివిన విద్యార్థులు..
* కొండూరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల ఐక్యత చూసి ఔరా అంటున్న గ్రామస్థులు..
ఆకేరు న్యూస్, రాయపర్తి :
కష్టం వస్తే మేమున్నామంటూ మానవత్వాన్ని చాటుకున్న బాల్య స్నేహితులు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన రాపాక రోజా తండ్రి రాపాక ఉప్పల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రోజా బాల్య స్నేహితులు (2008-09 విద్యాసంవత్సరం పదవ తరగతి తోటి విద్యార్థులు) వెంటనే స్పందించారు.తమతో పాటు చదువుకున్న స్నేహితురాలి కుటుంబానికి భరోసా కల్పించేందుకు తోటి విద్యార్థులంతా కలిసి ముందుకు వచ్చారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ వంతు సహాయంగా ₹25,000 (ఇరవై ఐదు వేల రూపాయల) నగదును రోజా కుటుంబ సభ్యులకు అందజేశారు.
* ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ..
“చదువుకునే రోజుల్లో కలిసి నడిచిన జ్ఞాపకాలు, స్నేహం ఎప్పటికీ విడిపోవు. మా స్నేహితురాలు రోజా కుటుంబానికి వచ్చిన కష్టం మా కుటుంబానికి వచ్చినట్టే భావించాం. 2008- 09 లో పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి చదువుకున్న వారి కుటుంబంలో ఎలాంటి సంఘటన జరిగిన మీకు మేము ఉన్నామంటూ ఆర్థికపరమైన మరియు ఉద్యోగపరమైన విషయాలలో భరోసా కల్పిస్తూ 2016 నుండి ఒకరికి ఒకరుగా తోడుంటూ ఐక్యమత్యమే బలం అంటూ ముందుకుసాగుతున్నామని తెలిపారు..అందులో భాగంగానే తమ తోటి విద్యార్థినీ గన్నారం గ్రామస్తురాలు రోజాకు సైతం ఈ చిన్న ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు.
తోటి స్నేహితులతో కలిసి అందించిన సహాయం రోజా కుటుంబ సభ్యులకు వారి బాధను పూర్తిగా దూరం చేయలేకపోయినా, అధైర్యపడకుండా అండగా ఉంటామనే నమ్మకాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం.”ఆపద సమయంలో స్పందించి, పాత జ్ఞాపకాలను, స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ తోటి స్నేహితురాలికి అండగా నిలిచిన 2008-09 టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులపై గన్నారం గ్రామ ప్రజలు మరియు పలువురు మేధావులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సదరు బ్యాచ్కు చెందిన పలువురు తోటి విద్యార్థులు, స్నేహితులు పాల్గొన్నారు.
