Chief Secretary Sanjay and DGP CV ANAND
* ఒకే వేదిక పై డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఆహార పదార్థాల కల్తీపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపాలని, ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు ఉన్నతాధికారులతో కలిసి ఆహార భద్రతపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
* డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ విభాగాలు కలిసి పనిచేయాలి
ఈ సందర్భంగా సీ ఎస్ మాట్లాడుతూ..
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడటంలో డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆహార ప్రమాణాల అమలు కోసం నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. సమన్వయాన్ని మరింత పెంచడం కోసం ప్రస్తుతం విడివిడిగా ఉన్న ఈ రెండు విభాగాలను ఒకే వేదిక కిందికి తీసుకురావాలని సీఎస్ ప్రతిపాదించారు.
దీనికి సంబంధించిన నివేదికలను వారం రోజుల్లోగా సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి, వాటిని అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది కొరత తదితర అంశాలపై కూడా చర్చించారు.
సచివాలయంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో స్పెషల్ సీఎస్ కె. రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, సీఎంఓ ప్రధాన కార్యదర్శులు శేషాద్రి, ఎన్. శ్రీధర్, జీఏడీ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తూ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హెల్త్ కమిషనర్ సంగీత, డ్రగ్ కంట్రోలర్ జనరల్ అవినాష్ మహంతి సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
