Bhadrakali Festival Schedule 2026
ఆకేరు న్యూస్, వరంగల్: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వరంగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆషాఢ శుద్ధ పాడ్యమి (జులై 15) నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి (జులై 29) వరకు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. తొలి రోజున వేదమంత్రాల నడుమ సహస్ర కలశాభిషేకాలు, గణపతి పూజ, పూర్వాంగవిధి కార్యక్రమాలతో ఉత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి.
* 500 ఏళ్ల చరిత్ర.. దేశంలోనే మొట్టమొదటి ఆలయం..
దేశంలోనే మొట్టమొదటి శాకాంబరీ ఉత్సవం ప్రారంభమయ్యేది వరంగల్ భద్రకాళి ఆలయంలోనేనని ఇక్కడి అర్చకులు చెబుతారు. ఇక్కడ వేడుకలు మొదలైన తర్వాతే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి సుమారు 450 నుంచి 500 ఏళ్ల నాటి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. పూర్వం దేశంలో తీవ్రమైన కరవు వచ్చి, వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. ఆ సమయంలో కరవు కాటకాలు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తోంది.
* రోజువారీ పూజా క్రమం – పూర్తి షెడ్యూల్…
ఈ 14 రోజుల పాటు నిత్య క్రమంలో భాగంగా అమ్మవారు రోజుకో విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జులై 15- ఉదయం కామేశ్వరి క్రమంలో పూజలు.
జులై 16- కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం.
జులై 17- కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం.
జులై 18- కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం.
జులై 19- విరోధినీ క్రమం, వహ్నివాసినీ క్రమం.
జులై 20- విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరీ క్రమం.
జులై 21- ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం.
జులై 22- ఉగ్రప్రభా క్రమం, త్వరితా క్రమం.
జులై 23- దీప్తా క్రమం, కులసుందరీ క్రమం.
జులై 24- నీలా క్రమం, విజయా క్రమం.
జులై 25- ఘనా క్రమం, నీలపతాకా క్రమం.
జులై 26- బలాకా క్రమం, విచిత్రా క్రమం.
జులై 27- మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం.
జులై 28- ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం.
జులై 29 (పౌర్ణమి)- మితా క్రమం.
చివరి రోజున ‘సంపూర్ణ శాకాంబరీ’ అలంకరణ.
ఈ మహోత్సవాలన్నింటిలోకెల్లా చివరి రోజైన జులై 29 (ఆషాఢ శుద్ధ పౌర్ణమి) నాడు జరిగే అలంకరణ అత్యంత అద్భుతమైనది. ఆ రోజు అమ్మవారు భక్తులకు ‘సంపూర్ణ శాకాంబరీ’గా దర్శనమిస్తారు. అమ్మవారిని పూర్తిగా ప్రకృతిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో నయనానందకరంగా అలంకరిస్తారు. ఆ సమయంలో శాకాంబరీ దేవిని దర్శించుకుంటే కరువు కాటకాలు దరిచేరవని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
* భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు…
ఈ ఉత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు విస్తృతమైన క్యూలైన్లు, తాగునీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
