N. Tirupati Rao Mahabubabad Illegal Money Lenders
* 10 మందిపై కేసులు నమోదు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
అక్రమ వడ్డీ వ్యాపారులపై మహబూబాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు..అక్రమంగా అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను ఆర్థికంగా వేధిస్తున్న ముఠాలపై మహబూబాబాద్ జిల్లా పోలీసులు దాడులు చేపట్టారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో సీఐలు, ఎస్ఐల ప్రత్యేక బృందాలు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. సబ్డివిజన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 90 అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు మెరుపు దాడులు చేశాయి. అక్రమ వడ్డీ వ్యాపారం, అనుమతి లేని చిట్టీలు నడుపుతున్న 10 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.
బాధితుల నుంచి షూరిటీల పేరుతో అక్రమంగా తీసుకున్న సుమారు రూ.3.59 కోట్ల విలువైన 266 కీలక పత్రాలు అంటే ఖాళీ చెక్కులు, భూములకు సంబంధించిన అసలు పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు పోలీసులు సీజ్ చేశారు.
* బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి
– ఎన్. తిరుపతి రావు (DSP, మహబూబాబాద్
అక్రమ వడ్డీ వ్యాపారం, అనుమతి లేని చిట్టీల నిర్వహణ, ప్రజలను బెదిరించి ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలు వసూలు చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవు.
మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకుల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో గానీ లేదా జిల్లా పోలీస్ అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలి. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతాం..
—————-.
