
మాట్లాడుతున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి డోబ్రియల్
30ఏళ్లలో ఇంత విధ్వంసం జరగడం ఇదే తొలిసారి
విపత్తుకు గల కారణాలను నిపుణుల సహకారం తీసుకుని దర్యాప్తు చేస్తాం
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని తాడ్వాయి-మేడారం వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపుల 200ల ఎకరాలు చెట్లు నేలకూలాయి. దాదాపు అన్ని రకాల చెట్లు విరిగి పోయాయి. కొన్ని చెట్లు వేర్లతో సహా ధ్వసం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి డోబ్రియల్ బుధవారం ధ్వంసం అయిన అడవిని, నేలకొరిగిన చెట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 30ఏళ్లుగా ఇలాంటి ఘటన ఎప్పుడు చోటుచేసుకోలేదని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ జరిగేదన్నారు. అంటే ఒకేసారి పెద్ద ఎత్తున తీవ్రమైన వేగంతో గాలి, మేఘాలు బలంగా ఒత్తిడితో కూడిన వాన కురవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందన్నారు. అడవిలో ఉన్న భూమిలో చెట్లకు కావాల్సిన పోషకాలు పై పొరలోనే లభ్యం అవుతుండడం వల్ల వేర్లు లోపలికి వెళ్లకుండా పై పొరలోనే దూరం వరకు వ్వాప్తి చెందాయని అధికారి తెలిపారు. ఈ కారణాల వల్ల బలమైన గాలులకు చెట్టుకు సంబంధించిన పునాది లోతుగా లేకపోవడంతో నేలకొరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ విపత్తుకు గల కారణాలను నిపుణుల సహకారం తీసుకుని దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు.
