
మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు ఉంది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ 15 ఎకరాల 20 గుంటలు ఉన్నది. ఈ చెరవుకు సంబంధించిన FTL (ఫుల్ ట్యాంక్ లెవల్)లో ఉన్న సర్వే నంబర్లు 12,13,14,16. ఈ భూములను కబ్జా చేసి నిర్మించిన షెడ్లు, భవనాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట లోని లక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.
అమీన్ పూర్లో..
ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ హెచ్ఎంటీ కాలనీ, వాణీ నగర్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.