
ఆకేరున్యూస్, ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడు షెహజాద్ మహమ్మద్ తరఫున వాదించేందుకు ఇద్దరు లాయర్లు గొడవపడ్డారు. దీంతో న్యాయమూర్తి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడిచేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరపరిచారు. నిందితుల బోనులో నిలబడి ఉన్న షెహజాద్ను.. పోలీసులపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి అతడు వ్యతిరేకంగా సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో షెహజాద్ వద్దకు వెళ్లిన ఓ లాయరు.. అతని తరఫున తాను వాదిస్తానంటూ వకాలత్ పత్రంపై సంతకం చేస్తున్నాడు. అంతలోనే మరో న్యాయవాది కూడా నిందితుని వద్దకు వెళ్లి తాను వకాల్తా పుచ్చుకుంటానంటూ సంబంధిత పత్రాలపై సంతకం కోసం ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు లాయర్లు కోర్టు హాలులోనే గొడవపడ్డారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఇద్దరూ ఒక టీమ్గా అతని తరఫున వాదనలు వినిపించవచ్చని తెలిపారు. దానికి ఆ ఇద్దరు లాయర్లు కూడా సమ్మతించారు.
………………………………