
* కేసీఆర్ బాటలో కుమార్తె కవిత
* తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం
* అదే ఎజెండాగా పదే పదే వ్యాఖ్యలు
* తాజాగా ఆంధ్రా బిర్యానీ ప్రస్తావన
* కెసిఆర్ ప్లానా? ఆమె సొంత ఎజెండా నేనా?
* పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకా?
* మరోవైపు ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల మండిపాటు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువగా వినిపించిన ఆంధ్రోళ్లు.. తెలంగాణోళ్లకు అన్యాయం.. అన్న పదాలు ఇటీవలి కాలంలో మళ్లీ వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గులాబీ బాస్ కేసీఆర్ పదే పదే ఆంధ్రోళ్లను విమర్శిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించారు. ఆంధ్రా నాయకులను “ఆంధ్రోళ్లు” అని సంబోధిస్తూ వారి ఆహారపు అలవాట్లను, ముఖ్యంగా బిర్యానీని ఎగతాళి చేస్తూ స్థానిక ప్రత్యేకతలను హైలెట్ చేసే ప్రయత్నం చేసేవారు. నాటి కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, తమకు జరుగుతున్న అన్యాయంపై ఆలోచించేలా చేశాయన్న పేరుంది. అలాగే గులాబీ పార్టీకి లబ్ధి చేకూర్చాయని కూడా విశ్లేషకులు పేర్కొంటారు. ఇప్పుడు అదే తరహాలో కవిత రాజకీయాలు ఉంటున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అదే బాటలో కేసీఆర్ తనయ
తెలంగాణ వచ్చింది. పదేళ్ల పాటు గులాబీ పార్టీ అప్రహతిహతంగా పాలన సాగించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇక అప్పటి నుంచి బీఆర్ ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కి.. మళ్లీ పుంజుకోవడానికి ఇటీవల నీటి ప్రాజెక్టులపై ఆందోళనలు మొదలుపెట్టి.. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ , పార్టీలో ఇటీవల సంచలనంగా మారారు. ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు వచ్చిన నాటి నుంచీ వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. జాగృతి సంస్థలను బలోపేతం చేస్తూ హైదరాబాద్లో ప్రత్యేక కార్యాలయమే ప్రారంభించారు. బీఆర్ ఎస్ పేరుతో కాకుండా తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న కార్యక్రమాలను, వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆంధ్రా – తెలంగాణ అంశాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్నాయి. తండ్రి కేసీఆర్ లానే తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
“ఆంధ్రోళ్ల” బిర్యానీ ఎట్లుంటదో తెలుసు కదా..
కవిత నిన్న తన నివాసంలో మీడియా సమావేశం పెట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి అంటూ ఆయన పాలనను విమర్శిస్తూ ఏపీకి ఆహార అలవాట్లపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 జూలై 6వ తేదీన ప్రజాభవన్లో రేవంత్రెడ్డితో సమావేశమైన తర్వాతే చంద్రబాబు నాయుడు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. 2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంతో కేసీఆర్పై బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్రెడ్డి భయపడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి.. గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్గా ఇచ్చారు’’ అని ఆరోపించారు. అంతటితో ఆగలేదు. ‘ఆంధ్రోళ్లు’ అంటూ వారిని సంబోధిస్తూ.. బిర్యానీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటాం? ఆంధ్రా బిర్యానీ ఎలా ఉంటదో కేసీఆర్ సార్ గతంలోనే చెప్పారు కదా’ అని కవిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కొద్ది రోజులుగా అదే తీరు..
కవిత రాజకీయాలను పరిశీలిస్తే కకొద్ది తెలంగాణ తో పాటు ఆంధ్రా ప్రస్తావన వస్తోంది. గతంలో జీహెచ్ ఎంసీలో జరుగుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ తెలంగాణ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఆంధ్రాకు చెందిన ఓ కంపెనీకి మేలు చేసేలా అధికారుల నిర్ణయాలు, టెండర్లు ఉంటున్నాయన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అలాగే ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఐదు ముంపు గ్రామాల అంశాన్ని లేవనెత్తారు. వాటిని ఆంధ్రాలో కలపడం వల్ల తెలంగాణకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రస్తావించారు. ఏపీలో కలిపిన ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారు రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతున్నారని, ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదన్నారు.
బిర్యానీ వ్యాఖ్యల కలకలం
ఇతర అంశాల సంగతి ఎలాగున్నా బిర్యానీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కేసీఆర్ కుటుంబం రాజకీయ లబ్ది కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడటం కొత్తేమీ కాదు” అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. “తెలంగాణ, ఆంధ్రా ప్రజలు సోదరుల్లా కలిసిమెలిసి ఉండాల్సిన సమయంలో, ఇలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి” అని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తూ తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రాంత వాసులకు కూడా సమ ప్రాధాన్యం ఇచ్చారని మరికొందరు ప్రస్తావిస్తున్నారు. కవిత వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్కు లబ్ది చేకూర్చినా, దీర్ఘకాలంలో రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ తరహాలోనే ఆంధ్రోళ్లను విమర్శిస్తూ కవిత కూడా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అలాగేఇది కెసిఆర్ ప్లానా? కవిత సొంత ఎజెండానేనా అనే అనుమానాలూ లేకపోలేదు.
…………………………………………………….