
* గతంలో రుణమాఫీ పేరుతో మోసం
* రైతులపై రూ.11,145 కోట్ల మేర వడ్డీ భారం
* బడ్జెట్లో రూ.72 వేల కోట్ల నిధులు కేటాయించాం
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రైతులకు సంబంధించి బీఆర్ఎస్కు ఏనాడు చిత్తశుద్ది లేదని, గతంలో వారు చేసిన రుణమాఫీ వ్యవహారమే ఇందుకు నిరదర్శనమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పుడు అది మరచిపోయి తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. భూమికి, విత్తనానికి మధ్య ఎలాంటి బంధం ఉందో.. రైతులతో కాంగ్రెస్ పార్టీకి అలాంటి బంధమే ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీని కూడా ఏకకాలంలో చేయలేదని.. తద్వారా రైతులపై రూ.11,145 కోట్ల మేర వడ్డీ భారం పడిరదన్నారు. గతంలో నాట్లు వేసే సమయం కాదు.. కోతల సమయానికి కూడా రైతుబంధు అందించలేదని విమర్శించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అని అన్నారు.
ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.72 వేల కోట్ల నిధులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించినట్లు తుమ్మల చెప్పారు. ‘పదేళ్ల భారాస పాలనలో తెలంగాణ రైతులు పడిన ఇబ్బందులు గమనించాం. వారి కన్నీరు తుడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేశాం. వరికి బోనస్.. మా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు ప్రారంభించాం. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. రైతును రాజును చేసేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.
…………………………………………