రూపాయి వివాదంలో ఆటో డ్రైవర్ ప్రేమ్సాగర్ మృతి
* రూపాయి విషయంలో వివాదం.. ఆటో డ్రైవర్ మృతి
ఆకేరు న్యూస్, వరంగల్ : రూపాయి విషయంలో ఇద్దరు మిత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఒకరు మరొకరిని నెట్టివేయడంతో తలకు రాయి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్లోని గరీబ్నగర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఈసంపల్లి ప్రేమ్సాగర్(39) బిర్యానీ కొనేందుకు లేబర్కాలనీ 100 ఫీట్ల రోడ్లోని ఓ హోటల్కు వెళ్లాడు. రూ.59 బిర్యానీని కొనుగోలు చేసి.. హోటల్ యజమానికి రూ.60 ఫోన్ పే ద్వారా చెల్లించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో ఆటో డ్రైవర్, ప్రేమ్సాగర్ స్నేహితుడు జన్ను అరవింద్ రూపాయి ఎందుకు ఎక్కువ ఇచ్చావని అడిగాడు. రూపాయేకదా అని ప్రేమసాగర్ అనగా.. మనకేమైనా పైసలు ఎక్కువ ఉన్నాయా..? అని అరవింద్ అన్నాడు. ఈ విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో ప్రేమ్సాగర్ను అరవింద్ నెట్టివేశాడు. కింద పడ్డ ప్రేమ్సాగర్ తలకు రాయి తగలడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రేమ్ సాగర్ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
