
* నిరసనకూ పరిమితులుంటాయి
* క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
* గాంధీభవన్ లో పీఏసీ సమావేశం
ఆకేరున్యూస్,హైదరాబాద్ ః హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో
పీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇంచార్జి మీనాక్షీ నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.ముఖ్యంగా ఇటీవల మరణించిన మాగంటి గోపీనాధ్ ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై చర్చించారు. మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉప్ప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే అని ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ లో గెలిచే బాధ్యతను ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. నియోజకవర్గంలోని నేతలందరినీ సమన్వయ పరిచి నడుచుకోవాలని ఆమె సూచించారు. ఇక.. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. తామే అభ్యర్థులమంటూ కొంతమంది తేల్చిచెబుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు. ఏ ఎన్నిక జరిగినా, ఉప ఎన్నిక జరిగినా ఒక ప్రక్రియ ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అదే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. పదవులు వచ్చిన వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు.
గొర్రెలతో నిరసనపై సీఎం సీరియస్..
గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన చేయడంపై సీఎం చాలా సీరియస్ అయ్యారు. నిరసనకు ఓ పరిమితి ఉంటుందన్నారు. కాంగ్రెస్ అందరి అభిప్రాయం తీసుకుంటుందని.. అందరినీ గౌరవిస్తుందన్నారు. ఇష్టా రీతిలో నిరసనలు చేస్తుంటే ఏం చేస్తున్నారు అని సీఎం ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు.
ఇంచార్జి మంత్రులపై అసంతృప్తి..
అలాగే ఇంచార్జి మంత్రుల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే భాధ్యత ఇంచార్జీ మంత్రులకు అప్పగించినా చేయడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం గెలిచేలా ఇంచార్జీ మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రుల దగ్గర ఫండ్స్ పెట్టామని, వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదని పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
……………………………………………….